ప్రముఖ నటి కీర్తి సురేశ్, సీనియర్ నటుడు జగపతిబాబుకు క్షమాపణలు తెలిపారు. తన వివాహానికి ఆయనను ఆహ్వానించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో **‘జయమ్ము నిశ్చయమ్మురా’**లో ఇటీవల కీర్తి సురేశ్ పాల్గొని తన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను, ఆంథోనీ తటిల్ దాదాపు పదిహేనేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఆమె చెప్పారు. ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించారు. తటిల్ ఆరేళ్లపాటు ఖతార్లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సుమారు నాలుగేళ్ల క్రితం ఈ విషయం ఇంట్లో చెప్పగా, తన తండ్రి వెంటనే అంగీకరించారని చెప్పారు.
అయితే, తన కుటుంబ సభ్యులకు చెప్పే ముందు ఈ విషయం జగపతిబాబుతో పంచుకున్నానని కీర్తి గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలో తన ప్రేమ గురించి చాలా కొద్దిమందికే తెలుసని, వారిలో జగపతిబాబు కూడా ఒకరని ఆమె తెలిపారు. “మీపై నాకున్న నమ్మకంతోనే నా వ్యక్తిగత విషయాలను మీతో పంచుకున్నాను. కానీ నా వివాహానికి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయాను. దయచేసి క్షమించండి,” అని కీర్తి సురేశ్ అన్నారు.
Read : Bunny Vas | బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై నిర్మాత బన్నీ వాసు స్పందన
